అమల్లోకి సీఏఏ: గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, ఆ 3 దేశాల ముస్లిమేతరులకు ప్రయోజనం
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. సీఏఏ అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. జనవరి 10వ తేదీ 2020 నుంచి చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద చేసింది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్కు చెందిన ముస్లిమేతరులు భారత పౌరసత్వం పొందనున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం గత నెల 11వ తేదీన పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అయితే సీఏఏ జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తోందని కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్కు చెందిన హిందువు, సిక్కు, బుద్దులు, జైనులు, పర్షి, క్రిస్టియన్లు పౌరసత్వం కోసం ఇబ్బంది పడుతుంటే.. వారు అక్రమ వలసదారులు కాదని, వారికి పౌరసత్వం ఇస్తామని చట్టం చెబుతోంది.
కానీ సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అధికార బీజేపీ మాత్రం ఆ దేశాలకు చెందిన మైనార్టీలు అక్కడ మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. వారు భారతదేశం రావడం తప్ప మరో మార్గం లేదని, అందుకే సీఏఏ తీసుకొచ్చామని సమర్థిస్తున్నారు.