కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే టార్గెట్: బెంగాల్ లోనూ ఇంటర్నెట్, మొబైల్ సేవల బంద్..!
కోల్ కత: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి దిగుతున్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లకు నిప్పు పెడుతున్నారు. రోజురోజుకూ పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక వాతావరణం మితిమీరుతుండటంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిషేధించింది.
అయిదు జిల్లాల్లో స్తంభించిన ఇంటర్నెట్..
మొత్తం అయిదు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. ఆందోళన ప్రదర్శనలు అధికంగా ఉన్న మాల్దా, ముర్షీదాబాద్, ఉత్తర దినాజ్ పూర్, హౌరా, 24 పరగణ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ఉత్తర 24 పరగణ జిల్లాలొోని బసీర్హాట్, బారాసట్ దక్షిణ 24 జిల్లాలోని బరూయ్ పూర్, క్యాన్నింగ్ ఉప డివిజన్లలో ఇంటర్నెట్ సేవలను నిషేధించినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై
ఈ అయిదు జిల్లాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగిన విషయం తెలిసిందే. ముర్షీదాబాద్ జిల్లాలో పలు రైళ్లు, రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. 24 పరగణా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వారు. పలుచోట్ల రైలు పట్టాలపై బైఠాయించారు. వాటికి సంబంధించిన దృశ్యాలన్నీ ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా విస్తృతంగా చలామణి అవుతున్నాయి.
షేర్ కాకుండా.. నిలిపివేత
ఆయా సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆస్తులపై దాడికి పాల్పడటానికి కారణాలవుతున్నాయనే ఉద్దేశంతో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపి వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు ఓ అధికారిక ప్రకటన జారీ చేశారు. 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోతాయని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా.. ఈ సమయాన్ని పెంచడమో లేదా కుదించడమో చేస్తామని వెల్లడించారు.
టైర్లను కాల్చి..
24 పరగణా జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లను సైతం దిగ్బంధించేయడంతో జనజీవనం అస్తవ్యవస్తమైంది. డెగంగా, ఖర్దా,- కల్యాణి ఎక్స్ ప్రెస్ వేలపై వారు బైఠాయించారు. టైర్లను కాల్చి నడిరోడ్డు మీద పడేశారు. ఫలితంగా- వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హింసకు దిగుతున్నారు. హౌరా జిల్లాలో కొన్ని చోట్ల వాహనాలను సైతం నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.
కేంద్రం చర్యలను ప్రోత్సహించం:
ఇదిలావుండగా- తమ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదును గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని గానీ, చర్యను గానీ తాము సమర్థించబోమని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఆందోళనకారులు తమ నిరసన ఉద్యమాలను నిలిపివేయట్లేదు.