అలీగఢ్ విధ్వంసం వెనుక విద్యార్థినులు: ఇంటర్నెట్ కట్: 24 గంటల పాటు.. !
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్లో ఆదివారం చోటు చేసుకున్న విధ్వంసం వెనుక కొంతమంది విద్యార్థినుల హస్తం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రభూషణ్ సింగ్ వెల్లడించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థినులు ఈ విధ్వంసానికి దిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సంఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా అలీగఢ్లో ఆదివారం మధ్యాహ్నం నుంచీ పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అలీగఢ్లోని ఊపర్కోట్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ప్రదర్శనగా వచ్చిన కొంతమంది స్థానికులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆందోళనకారుల ప్రదర్శనలకు భీమ్ ఆర్మీ కార్యకర్తలు మద్దతు పలికారు. దుకాణాలపై రాళ్లు రువ్వారు. పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. వాహనాలను తగులబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రాళ్లు రువ్విన ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
స్థానిక జామా మసీదు వద్ద 100 కిలో ఓల్టుల సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్కు నిప్పు అంటించడానికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వారిని నిలువరించగలిగారు. ఈ సందర్భంగా ప్రదర్శనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. జామా మసీదు మీదుగా ఈద్గా మైదాన్ వరకు వెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారని, మార్గమధ్యలో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థినులు వారితో కలిశారని చంద్రభూషణ్ సింగ్ వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. పోలీసులు కాల్పులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అవన్నీ నిరాధారమైనవని అధికారులు తోసిపుచ్చారు. తాము ఎలాంటి కాల్పులకు పాల్పడలేదని అన్నారు. వదంతులు వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు ఇంటర్నెట్ను నిలిపివేశారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ అందుబాటులో ఉండదని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే.. మొబైల్ ఫోన్ సేవలను కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.