ట్రెండ్ సెట్ చేసిన రజనీకాంత్: ఆందోళన చేయాల్సిన పద్ధతి ఇది కాదు.. మౌనంగా!
చెన్నై: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ఓ కామెంట్.. ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువైంది. దీనిపై నెటిజన్లు, ట్విట్టరెటీలు భిన్నంగా స్పందిస్తున్నారు. రజినీకాంత్ ను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, సంఘ్ పరివార్ కార్యకర్తగా అభివర్ణిస్తున్నారు. తెరచాటు మంత్రాంగాన్ని నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఆందోళనలు చేయాల్సిన పద్ధతి ఇది కాదంటూ..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులు, పోలీసు కాల్పులను ఉటంకిస్తూ రజినీకాంత్ ఓ ట్వీట్ చేశారు.. తమిళంలో!. ఆందోళనలు చేపట్టిన నిరసన ప్రదర్శనల తీరును ఆయన తప్పు పట్టారు. ఆందోళనలను గానీ, నిరసన ప్రదర్శనలను హింసాత్మక స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా, మౌన ప్రదర్శనల ద్వారా కూడా తమ నిరసనలను వ్యక్తం చేసుకోవచ్చని చెప్పారు.
కాల్పులు.. కలచివేశాయి..
హింసాత్మకంగా నిరసనలను ప్రదర్శించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయని, వాటిని అనుసరించాలని రజినీకాంత్ సూచించారు. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఈ ప్రదర్శన తనను కలచి వేసిందని రజినీకాంత్ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్, మంగళూరుల్లో ముగ్గురు ఆందోళనకారులు పోలీసు తూటాలకు బలి కావడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఆందోళనలను శాంతియుతంగా నిర్వహించాలని, మౌన ప్రదర్శనల ద్వారా తమ నిరసనలను తెలియజేయాలని కోరారు.
నెటిజన్లు, ట్విట్టరెట్టీల నుంచి భిన్న స్పందన..
రజినీకాంత్ చేసిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు ట్విట్టరెటీలు రజినీకాంత్ కు మద్దతుగా నిలిచారు. #IStandWithRajinikanth అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించి, తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రజినీకాంత్ చేసిన సూచన గొప్పగా ఉందని, ఆందోళనకారులు దాన్ని అనుసరించాలని చెబుతున్నారు. ఆందోళనలను హింసాత్మక స్థాయికి తీసుకెళ్లడం వల్ల ఎవరికీ మేలు జరగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మంగళూరుల్లో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని, దీనికి ఎవరు జవాబుదారి వహించాలని అంటున్నారు.
సంఘ్ పరివార్ కార్యకర్తగా..
అదే సమయంలో- రజినీకాంత్ చేసిన ప్రకటనను వ్యతిరేకించే నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. #ShameOnYouSanghiRajini అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. రజినీకాంత్ ఓ పక్కా సంఘ్ పరివార్ కార్యకర్తగా స్పందించారని విమర్శించారు. బీజేపీకి దగ్గర కావడానికి ఆయన చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. ఆందోళనలను అహింసాయుతంగా నిర్వహిస్తే.. అది ప్రభుత్వం దృష్టికి చేరుతుందా? అని నిలదీస్తున్నారు. తెర వెనుక ఉంటూ తమిళనాడులో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.