జైళ్లు కూడా సరిపోవట్లేదు: 18 మంది మృతి: 5000 మందికి పైగా కస్టడీ: బీజేపీ పాలిత రాష్ట్రంలనే..!
లక్నో: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై చోటు చేసుకుంటున్న నిరసన ప్రదర్శనలకు అడ్డుకట్ట పడట్లేదు. హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం.. ఒక రాష్ట్రంలో శాంతించాయనుకునే లోగా.. మరో రాష్ట్రానికి పాకుతున్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన వెంటనే ఈశాన్యంలో చెలరేగిన మంటలు అన్ని దిక్కులకూ వ్యాపించాయి. ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి.
ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే..
పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లోనే అసాధారణ స్థితిలో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీలతో పోల్చుకుంటే.. ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న అల్లర్ల వేడి అసాధారనంగా ఉంటోంది. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే పోలీసుల కాల్పుల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారంటే అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జైళ్లు కూడా సరిపోవట్లేదు..
ఉత్తర ప్రదేశ్ లో అల్లర్లు, హింసాత్మక వాతావరణానికి కారణమైన వారిని నిర్బంధించడానికి అక్కడి కారాగారాలు కూడా సరిపోవట్లేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల భవనాలను తాత్కాలిక కారాగారాలుగా మార్చుకోవాల్సిన వచ్చిందక్కడ. ఉత్తర ప్రదేశ్ లో ఆందోళనలు మొదలైన తరువాత అయిదువేల మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 705 మందిని అరెస్టు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.
చల్లారని హింస..
రాజధాని లక్నో సహా పలు జిల్లాల్లో చెలరేగిన పౌరసత్వ సవరణ వ్యతిరేక జ్వాలలు చల్లారట్లేదు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి పారా మిలటరీ బలగాలను మోహరింపజేసింది యోగి సర్కార్. అయినప్పటికీ ఎక్కడో ఓ ప్రాంతంలో వ్యతిరేక సెగలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పోలీసులు కాల్పులు జరిపేంత తీవ్రతను సంతరించుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట ఎప్పుడు? ఎక్కడ? పడుతుందో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది.
నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలోనూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాశి సహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ అల్లర్లు చెలరేగుతున్నాయి. బదౌహి, బహ్రయిచ్, అమ్రోహ, ఫరూఖాబాద్, ఘజియాబాద్, ముజప్ఫర్ నగర్, సహరాన్ పూర్, హాపుర్, హత్రాస్, బులంద్ షహర్, హమీర్ పూర్, మహోబా వంటి రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులోకి రావట్లేదు. ఆయా జిల్లాల్లో పోలీసు యాంత్రాంగం ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
21 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్.. పాఠశాలలకు సెలవు
ఉత్తర ప్రదేశ్ లో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో మూడు రోజుల కిందట ప్రకటించిన ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి సోషల్ మీడియా నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 21 జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి నెలకొంది. సోమవారం వరకూ ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగనుంది. ఆయా జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. సుమారు 13 వేలకు పైగా సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు నిషేధించారు.