పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంపై మోడీ-అమిత షా ఏం చెబుతున్నారంటే.. !
Recommended Video
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లుకు ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుపై ఓటింగ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి భిన్న వైఖరిని అనుసరించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించింది. శివసేన ఓటింగ్ ను బహిష్కరించింది.
TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!
సోదరభావాన్ని పెంపొందించే బిల్లు..
ప్రతిపక్ష సభ్యుల నిరసనలు గానీ, ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా సోదర భావాన్ని పెంపొందించే చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పెద్దల సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన స్పందనను వ్యక్తం చేశారు. కోట్లాదిమంది భారతీయుల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ఈ బిల్లు తనవంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సభ్యులకు అభినందనలు..
పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. సంవత్సరాల తరబడి భారత్ లో నివసిస్తోన్న హిందూ శరణార్థులకు ఈ బిల్లు ఊపిరి పోస్తుందని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన హిందువులను భారతీయులుగా గుర్తించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందనే విషయం తెలిసిందే.
బాధిత శరణార్థుల స్వప్నం సాకారం..
పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందడాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు. దశాబ్దాల తరబడి భారత్ లో ఎలాంటి ఆదరణకూ నోచుకోకుండా శరణార్థులుగా తలదాచుకుంటున్న వారికి ఈ బిల్లు మనదేశ పౌరసత్వాన్ని కల్పిస్తుందని అన్నారు. దీనికోసం లక్షలాది మంది శరణార్థులు, నిరాశ్రయులు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వారి స్వప్నం ఫలించిందని అన్నారు.