బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు..!
గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అస్సాం, త్రిపురల్లో ఉవ్వెత్తున ఎగిసి పడుతోన్న హింసాత్మక జ్వాలలను నియంత్రించడానికి అటు కేంద్రం, ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా అస్సాంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టారు.
దిబ్రూగఢ్ జిల్లాలోని చబువాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన చబువా ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసానికి గురువారం మధ్యాహ్నం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో హజారికా గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హజారికాకు చెందిన పార్టీ కార్యాలయం, ప్రభుత్వ సర్కిల్ కార్యాలయ భవనానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా దిబ్రూగఢ్, గువాహటి, డిస్పూర్ లల్లో అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా హజారికా, ఆయన కుటుంబ సభ్యులను భద్రత సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. హజారికా నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక దళ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇదిలావుండగా- పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనొవాల్.. ఓ ప్రకటన చేశారు. శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవాలను మరో 48 గంటల పాటు నిలిపివేసినట్లు వెల్లడించారు.