మేఘాలయాలో పౌరసత్వ ఉద్రిక్తత: ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు: సోషల్ మీడియాపై నిఘా
షిల్లాంగ్: పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తూ అగ్నిగుండంలా మారిన ఈశాన్యా రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయా కూడా చేరింది. ఇప్పటిదాకా అస్సాం, త్రిపురలకే పరిమితమైన హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం.. క్రమంగా మేఘాలయాలను కమ్ముకుంటోంది. పరిస్థితిని ముందే పసిగట్టిన అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఎస్ఎంఎస్ లపై నిషేధాన్ని అమలు చేస్తోంది. రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూ విధించింది.
ఆ రాష్ట్రాల జాబితాలో మేఘాలయా..
పౌరసత్వ సవరణ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు మొత్తం వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తోంది. అస్సాం, త్రిపురలకే పరిమితమైన హింసాత్మక పరిస్థితులు మేఘాలయాలో నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. సోషల్ మీడియాపై నిఘా ఉంచింది. అల్లర్లను రెచ్చగొట్టేలా గానీ, ఉద్రిక్త పరిస్థితులను ప్రోత్సహించేలా గానీ ఎలాంటి సందేశాలను పంపించినా, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై నిఘా..
వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్ సహా అదే తరహా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ఎలాంటి అభ్యంతరకర సందేశాలను పంపించినా తీవ్ర చర్యలను తీసుకుంటామని మేఘాలయా హోం మంత్రిత్వ శాఖ అదనపు ప్రభుత్వ కార్యదర్శి సీవీడీ డియాంగ్డో తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటన జారీ చేశారు. సెల్ ఫోన్ ల నుంచి ఎస్ఎంఎస్ లను పంపించడాన్నీ నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ బంద్..
అన్ని రకాల సంస్థలకు చెందిన మొబైల్ ఇంటర్నెట్/డేటా సర్వీస్ లను తక్షణమే నిలిపివేసినట్లు వెల్లడించారు. 48 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లోకి ఉంటాయని డియాంగ్డో స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, ఉద్రిక్తతలు, దాడులు, అల్లర్లను ప్రేరేపించేలా ఎవరు, ఎలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.
షిల్లాంగ్ లో కర్ఫ్యూ..
కాగా- రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూను విధించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. షిల్లాంగ్ లోని కొన్ని సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో తొలిదశలో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా.. కర్ఫ్యూ విధించిన ప్రాంతాల సంఖ్యను మరింత పెంచడమో లేదా సడలించడమో చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి మేఘాలయాలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.