లోక్సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు: చట్టాలకు సవరణే అంటూ అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం(డిసెంబర్ 9) పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్సభ బిజినెస్లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోడీ ప్రభుత్వం.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మనదేశానికి వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తీసుకొచ్చింది మోడీ సర్కారు. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది. ముస్లిం దేశాల నుంచి మత ఘర్షణల కారణంగా, అక్కడవారి వేధింపులతో వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ బిల్లును కాంగ్రెస్ తోపాటు తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
చట్టాల సవరణే అంటూ అమిత్ షా
చట్టాలకు సవరణ చేయాల్సిన అవసరం ఉందని, హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండటంతో ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతూ రాష్ట్రాలకు కూడా లేఖలు రాశారు.
పుణెలో నిర్వహించిన 54వ డీజీపీ, ఐజీపీల సదస్సుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరముందని అమిత్ షా చెప్పారు.
ప్రతి రాష్ట్రంలో అనుబంధ కళాశాలలతో ఆల్ ఇండియా పోలీస్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులందరూ ఒక తాటిపైకి వచ్చి జాతీయ భద్రతకు తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలియజేయాలని కోరారు.