Citizenship Bill:బీజేపీయేతర సీఎంలే దేశాన్ని కాపాడాలి..ప్రశాంత్ కిషోర్ ట్వీట్
పౌరసత్వ సవరణ బిల్లు నితీష్ కుమార్ జేడీయూలో అగ్గిరాజేసింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు వల్ల దేశానికి దేశ లౌకికత్వానికి ప్రమాదమని ఇప్పటికే తమ నిరసన గళం వినిపించారు జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ నేతలు పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రంలో అగ్గిరాజేస్తోందని ఇక దేశాన్ని కాపాడాల్సింది బీజేపీయేతర ముఖ్యమంత్రులు, మరియు న్యూట్రల్గా ఉన్న ముఖ్యమంత్రులే అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్లలో వివక్షకు గురైన ముస్లింయేతర వలసదారులకు పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తోంది. ఆ మూడు ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వచ్చిన ఇతర మతస్తులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రభుత్వం బిల్లులో సవరణ చేసి పార్లమెంటులో ఆమోదింప చేసింది.
The majority prevailed in Parliament. Now beyond judiciary, the task of saving the soul of India is on 16 Non-BJP CMs as it is the states who have to operationalise these acts.
— Prashant Kishor (@PrashantKishor) December 13, 2019
3 CMs (Punjab/Kerala/WB) have said NO to #CAB and #NRC. Time for others to make their stand clear.
చివరి నిమిషం వరకు బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ అనూహ్యంగా బిల్లుకు ఇటు లోక్సభ అటు రాజ్యసభలో మద్దతు ఇవ్వడంపై ప్రశాంత్ కిషోర్ మరో సీనియర్ నాయకుడు పవన్ వర్మలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన పౌరసత్వ బిల్లు వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్కు సమానంగా ఉందని హెచ్చరించారు ప్రశాంత్ కిషోర్. ఈ రెండు పౌరులపై వివక్ష చూపే ఆస్కారం ఉందని చెప్పారు. అంతేకాదు మత ప్రాతిపదికన ప్రజలను విచారణ చేసే అవకాశం కూడా ఉందని ప్రశాంత్ కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్సీ ద్వారా అక్రమవలస దారులను గుర్తించడం జరుగుతుంది. అస్సాంలో దాదాపు 2 మిలియన్ మంది ప్రజలు ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. ఇదే ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లును ఇప్పటికే మూడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బిల్లుపై తమ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని చెప్పారు.