Citizenship Bill:1985అస్సాం ఒప్పందంలో ఏముంది..? క్లాజ్ 5 ప్రత్యేకత ఏంటి..?
పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ప్రజలు విద్యార్థి సంఘాలు రోడ్లపైకొచ్చి నిరసన గళాన్ని వినిపించాయి. ఆందోళనలు మిన్నంటడంతో పరిస్థితి కాస్త హింసాత్మకంగా మారింది. అయితే పౌరసత్వ సవరణ బిల్లు 1985 అస్సాం ఒప్పందంకు తూట్లు పొడిచేలా ఉందనే వాదన తొలి నుంచి వినిపిస్తోంది. ఇంతకీ 1985 అస్సాం ఒప్పందం ఏం చెబుతోంది..?
1979లో భగ్గుమన్న అస్సాం
అస్సాంలో అక్రమ వలసదారులు అనేది చాలా పాత అంశం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాకా ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అక్రమ వలసదారులను తిరిగి తమ ప్రాంతాలకు లేదా దేశాలకు పంపించేలా 1950లో ప్రభుత్వం బలవంతంగా చట్టం తీసుకురావాల్సి వచ్చింది.1951జనాభా లెక్కల ప్రకారం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ను తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదే ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. అక్రమ వలసదారుల అంశంపై 1979 నుంచి ఆరేళ్ల పాటు అస్సాం భగ్గుమంది. నిత్యం నిరసనలు జరిగేవి.ఈ క్రమంలోనే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఈ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. విదేశీయులపై ఫిర్యాదు చేసింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారున్నారు. వీరి పేర్లు ఓటర్ జాబితాలో కూడా ఉండేవి.
రాజీవ్ గాంధీ హయాంలో అస్సాం ఒప్పందం
1980 నుంచి 1984ల మధ్య ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న సమయంలో నిరసనలు కొనసాగాయి.అయితే ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఆమె హత్యకు గురయ్యాక రాజీవ్గాంధీ ప్రభుత్వం నిరసనకారులతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నవారిలో ఆల్ అసామ్ స్టూడెంట్స్ యూనియన్ మరియు ఆల్ అస్సాం గనసంగ్రామ్ పరిషత్లు ఉన్నాయి. ఒప్పందం కుదుర్చుకున్నాక నిరసనలు మానేశారు. ప్రభుత్వం మరియు ఏఏఎస్యూ ఏఏజీఎస్పీల మధ్య జరిగిన ఒప్పందంనే అస్సాం ఒప్పందంగా పిలుస్తున్నాము.ఇది 1985 ఆగష్టు 15న జరిగింది. అస్సాం ఒప్పందంలో మొత్తం 15 క్లాజ్లు ఉన్నాయి. అందులో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలు ఇలా ఉన్నాయి. విదేశీ అంశం, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తులు విదేశీయుల చేతికి వెళ్లకుండా ఆంక్షలు, ప్రభుత్వ భూముల కబ్జా, జనన మరణాల రిజిస్ట్రేషన్ వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్కృతి గుర్తింపు స్థానిక ప్రజలకే ఉండాలన్నది అభిమతం.
అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 5 ఏం చెబుతోంది..?
ఇక ఒప్పందంలోని క్లాజ్ 5 విదేశీయుల అంశం గురించి వివరిస్తుంది. అస్సాంలో విదేశీయులను గుర్తించి వారి పేర్లను ఓటర్ జాబితాలో నుంచి తొలగించి వారిని తమ సొంత దేశానికి పంపే కార్యక్రమం చేయాలని వివరిస్తుంది. విదేశీయులను గుర్తించేందుకు మూడు సూచనలను క్లాజ్ 5లో పొందుపర్చారు. అస్సాం ఒప్పందంలో రెండు తేదీలు అత్యంత ప్రధాన్యత కలిగినవి. అవి 1 జనవరి 1966, 24 మార్చి 1971. జనవరి 1, 1966కు ముందు అంటే డిసెంబర్ 31, 1965వరకు ఎవరైతే విదేశీయులు అస్సాంకు వచ్చి స్థిరపడ్డారో ఎవరి పేర్లయితే 1967 ఎన్నికల ఓటర్ జాబితాలో ఉన్నాయో వారందరికీ పౌరసత్వం ఇచ్చేలా క్లాజ్ 5లో పొందుపర్చారు.
విదేశీయులు అయినప్పటికీ ...
ఇక జనవరి 1, 1966 నుంచి మార్చి 24,1971 మధ్య వచ్చిన వారందరినీ గుర్తించి విదేశీ చట్టం 1946 మరియు ఫారిన్ ఆర్డర్ 1964 ప్రకారం వారికి భారత పౌరసత్వం ఇవ్వకూడదని వారిని ఓటర్ లిస్టు నుంచి తొలగించాలని అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 5లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విదేశీయులు అయినప్పటికీ వారిని తమ సొంత దేశాలకు పంపాలని లేదు కానీ, వారు దేశంలో అడుగుపెట్టి 10 ఏళ్లుగా భారత్లో నివాసం ఉంటేనే వారికి ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుందని క్లాజ్ 5 వివరిస్తోంది. ఇక మిగతావారు మాత్రం తమ దేశాలకు వెళ్లిపోవాల్సిందే అని చెబుతోంది. అంతేకాదు మతపరమైన పీడితకు గురై అక్రమంగా వలస వచ్చిన వారు కూడా అస్సాంలో ఉండేందుకు వీలు లేదని క్లాజ్ 5 స్పష్టం చేస్తోంది.