సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన, తిరస్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జస్టిస్ దీపక్ మిశ్రాపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం తిరస్కరించారు. సుప్రీం జస్టిస్ పైన విపక్షాలు అభిశంసన తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ సహా ఏడు విపక్షాలు ఈ నోటీసులు ఇచ్చాయి. ఈ అభిసంసన నోటీసులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యాయ నిపుణులతో చర్చించారు. వారి సలహాతో సోమవారం ఆ నోటీసును తిరస్కరించారు.
సీజేకు ఉద్వాసన పలకాలంటూ గత శుక్రవారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసు అందించారు. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు. మొత్తం 71 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినప్పటికీ వారిలో ఏడుగురు ఇటీవల పదవీ విరమణ పొందారు. దీంతో 64 మంది మాత్రమే సంతకం చేసినట్లయింది. మొత్తం ఐదు రకాల దుష్ప్రవర్తన ఆధారంగా ఈ నోటీసు తీసుకొచ్చారు.
దీంతో ఈ నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు వెంకయ్య నాయుడు న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు. ఇందుకోసం హైదరాబాద్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఆదివారం సాయంత్రం ఢిల్లీ వచ్చేశారు. ఏజీ కేకే వేణుగోపాల్, సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా, శాసన వ్యవహారాల మాజీ కార్యదర్శి సంజయ్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో నోటీసును తిరస్కరించాలని న్యాయకోవిధులు సలహా ఇచ్చారు.
మరోవైపు, భిశంసన నోటీసును రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరిస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతిపక్ష పార్టీలు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వారు సుప్రీం కోర్టు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు వారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అభిశంసన సరికాదు
అభిశంసన తీర్మానం పెట్టడం దుర్దినమని, ఒక జడ్జిమెంట్పై అభిశంసనకు రావడం మంచి పద్ధతి కాదని, అభిశంసనకు కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ పెట్టాల్సి ఉంటుందని, అభశంసన తీసుకురావడం రాజ్యాంగాన్ని కించపరచడమని సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ అన్నారు. అభిశంసన ప్రమాదకరమని జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి అభిశంసన ఒక్కటే మార్గం కాదని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు.