కేసుల కేటాయింపులో నిర్ణయాధికారం 'సీజేఐ'దే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బెంచ్ల ఏర్పాటు, కేసుల కేటాయింపు విషయంలో సుప్రీం చీఫ్ జస్టిస్ నిర్ణయాధికారాలను సవాల్ చేస్తూ మాజీ అడ్వకేట్ అశోక్ పాండే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూద్ లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వాదనను తప్పుపట్టింది.
కేసుల కేటాయింపు విషయంలో పూర్తి నిర్ణయాధికారం 'చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా'(సీజేఐ)కు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, కేసుల కేటాయింపుకు సంబంధించి సీజేఐ అపెక్స్ కోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయవాదుల సలహాలు-సూచనలు కూడా స్వీకరించాలని అశోక్ పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ విషయంలో సీజేఐ ఏకపక్ష నిర్ణయాలు వద్దు: సుప్రీంలో సంచలన పిటిషన్
అశోక్ పాండే పిటిషన్ పై లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన న్యాయమూర్తి చంద్రచూద్ 'సమకాలీన న్యాయవాదుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంటారు. కేసుల కేటాయింపు, బెంచ్ల ఏర్పాటులో ఆయనకే నిర్ణయాధికారం ఉంటుంది' అని అందులో తెలిపారు.
కాగా, సుప్రీం కోర్టులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ.. గత జనవరి నెలలో నలుగురు సుప్రీం న్యాయవాదులు దేశ చరిత్రలోనే తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
నాలుగు రోజుల క్రితమే సీజేఐ నిర్ణయాధికారాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ అడ్వకేట్ శాంతిభూషణ్ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.