సీజేఐపై అభిశంసన?: నేడే విచారణ, ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభిశంసన ప్రయత్నాలకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆదిలోనే తిరస్కరించడంతో.. దాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గుజరాత్ కు చెందిన అమీ హర్షడ్రే, పంజాబ్ కు చెందిన ప్రతాప్ సింగ్ బాజవా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు. పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ వాదించారు. పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనానికి వారు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ ఏకె సిక్రీ నేత్రుత్వంలోని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డె, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎ.కె.గోయెల్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, సీనియారిటీ పరంగా ఈ కేసును జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్ లకు అప్పగించాల్సి ఉండగా.. వారిని పక్కనబెట్టి సీనియారిటీ జాబితాలో ఆరో స్థానంలో ఉన్న సిక్రీకి, ఆ తర్వాత ఉన్నవారికి కేసు అప్పగించడం గమనార్హం.
కాగా, గత జనవరి 12న సుప్రీంలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎం.బి.లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా కేసును వారికి అప్పగించలేదని తెలుస్తోంది.