కేంద్రానికి చీఫ్ జస్టిస్ బోబ్డే సీరియస్ లేఖ.. న్యాయస్థానాల్లో భద్రతపై ఆందోళన.. కీలక ప్రతిపాదనలు
మండల కేంద్రాల్లోని మున్సిఫ్ కోర్టులు మొదలుకొని ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం దాకా.. కోర్టుల్లో సెక్యూరిటీ ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయిని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. కోర్టు ఆవరణలో ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే.. పోలీసులు వచ్చేదాకా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. వెంటనే స్పందించి రంగంలోకి దిగేలా ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరమని ఆయన చెప్పారు.
కోర్టుల్లో భద్రతపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని సీజేఐ బోబ్డే బుధవారం వెల్లడించారు. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో.. సుప్రీంకోర్టు, హైకోర్టులు, ట్రిబ్యూనళ్లు సహా కీలక విచారణను జరిగే అన్ని చోట్లా సెక్యూరిటీని బలోపేతం చేయాలని, అందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తరహాలో ఒక విభాగాన్ని ఏర్పాటుచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో లాయర్లు, పోలీసులు గొడవపడటం, ఆ క్రమలో తీవ్ర హింస చోటుచేసుకోవడాన్ని లేఖలో ప్రస్తావించానన్న సీజేఐ.. సడెన్ గా చెలరేగే హింసను నిరోధించాలంటే ప్రత్యేక బలగాలు ఉండి తీరాల్సిందేనని చెప్పారు. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.