అయోధ్యపై వాదనలు అనంతరం..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం: 4 నుంచి 15 లోపల, ఎప్పుడైనా!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై తుది విచారణ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ లోపలే అయోధ్య భూ వివాదం కేసుపై తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున ఆయన తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్యపై 40 రోజుల పాటు చేపట్టిన విచారణ సందర్భంగా ఎదురైన అభిప్రాయాలపై చర్చించాల్సి ఉందని, విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తే.. సమయం సరిపోదని గొగొయ్ భావించినట్లు చెబుతున్నారు.
2..77 ఎకరాలు ఎవరికి చెందాలి?
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల స్థలాన్ని ఎవరికి చెందాలనే విషయంపై దాఖలైన పిటీషన్లపై చేపట్టిన విచారణ పర్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారానికి తెర దించిన విషయం తెలిసిందే. రంజన్ గొగొయ్ సహా ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, నజీర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వచ్చే నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆయన తీర్పును వెల్లడించాల్సి ఉంది.
షెడ్యూల్ ఖరారైనా.. రద్దు
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. రంజన్ గొగొయ్ శుక్రవారం నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం ఆయన దుబాయ్ బయలుదేరాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. దుబాయ్, ఆ తరువాత ఈజిప్టు, బ్రెజిల్, న్యూయార్క్ లల్లో కొన్ని అధికారిక, అనధికారిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కూడా. ఈ నెల 31వ తేదీ వరకూ రంజన్ గొగొయ్ విదేశీ పర్యటన కొనసాగాల్సి ఉంది. 12 రోజుల పాటు విదేశాల్లో పర్యటించడానికి ఏర్పాట్లను చేసుకున్నారు.
12 రోజుల పాటు నాలుగు విదేశాల్లో చీఫ్ జస్టిస్..
అయోధ్య భూ వివాదంపై తుది విచారణ ముగిసినందున.. ఇక తీర్పు వెల్లడించడంపై గొగొయ్ దృష్టి పెట్టారని, తీర్పు సారాంశం ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలు పెట్టేశారని అంటున్నారు. దీని కోసం న్యాయ నిపుణులు, తోటి న్యాయమూర్తులతో భేటీ కావాల్సి ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏకంగా 12 రోజుల పాటు విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే.. దాని ప్రభావం సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు తీర్పుపై ఎంతో కొంత పడే అవకాశాలు లేకపోలేదని గొగొయ్ భావించినట్లు చెబుతున్నారు. దీనికి బదులుగా అయోధ్య తీర్పు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
4 నుంచి 15 లోపు వెలువడే ఛాన్స్?
ఇదిలావుండగా- అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేనెల 4 నుంచి 15వ తేదీ లోపు ఎప్పుడైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే నెల 17వ తేదీన గొగొయ్ పదవీ విరమణ చేయనున్నందు.. ఆ లోపే తీర్పును వెలవడించాలని చీఫ్ జస్టిస్ ఓ నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. హైడ్రామాల మధ్య అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టే బుధవారం తుది విచారణు నిర్వహించారు. విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలో తీవ్ర రూపాన్ని ధరించిందనే విషయం స్పష్టమౌతోందని నిపుణులు చెబుతున్నారు.