కదులుతోన్న ముఖ్యమంత్రి కుర్చీ? 23 మందితో తిరుగుబాటు చేసిన డిప్యూటీ: ఢిల్లీలో మకాం
జైపూర్: రాజస్థాన్లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న 23 మంది రెబెల్ ఎమ్మెల్యేలతో ఆయన ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం వేశారు. ఈ సాయంత్రంలోగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకోనున్నారు. అదే సమయంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులు బాధను కలిగిస్తున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ తరహా రాజకీయాలు..
మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితులను చవి చూడొచ్చని అంటున్నారు. 23 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు లేవనెత్తిన సచిన్ పైలట్.. తన డిమాండ్లను అధిష్ఠానం ముందు ఉంచబోతున్నారని, దానికి అంగీకరించకపోతే.. పార్టీని ఫిరాయించడం ఖాయమని చెబుతున్నారు. ఇదివరకు కర్ణాటక, మధ్యప్రదేశ్లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో చేదు ఫలితాలను ఎదుర్కొంది. ఈ రెండు చోట్లా చేతికి అందిన అధికారాన్ని జారవిడుచుకుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది.
జ్యోతిరాదిత్య సింధియా బాటలోనే..
మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి తిరుగుబాటు చోటు చేసుకోవడమే ప్రధాన కారణం. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే కారణంతో.. అసంతృప్తిగా ఉంటూ వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయించారు. తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. ఫలితంగా కమల్ నాథ్ కుర్చీ కదిలిపోయింది. మైనారిటీలో పడిన ఆయన ప్రభుత్వం అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. కమల్ నాథ్ స్థానంలో బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజస్థాన్లోనూ అవే పరిస్థితులు..
ప్రస్తుతం రాజస్థాన్లో కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్ గెహ్లాట్ సారథ్యంపై కొన్నాళ్లుగా సచిన్ పైలట్ అసంతృిప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది కాస్తా ఇప్పుడు భగ్గున అంటుకుంది. అశోక్ గెహ్లాట్ను ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఆత్మహత్యా సదశ్యమౌతుందంటూ ఆరోపిస్తున్నారు సచిన్ పైలట్. ఆయనను గద్దె దించకపోతే ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడం ఖాయమనీ అంటున్నారు. ఇదే డిమాండ్తో ఆయన హస్తినలో మకాం వేశారు. సచిన్ పైలట్కు 23 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారని చెబుతున్నారు. వారందరితో కలిసి ఆయన ఈ సాయంత్రానికి సోనియాగాంధీని కలుసుకోవచ్చని తెలుస్తోంది.
Recommended Video
కపిల్ సిబల్ ట్వీట్..
రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న ఈ విభేదాల పట్ల పార్టీ సీనియ్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో ఏం జరుగుతోందో తెలియట్లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చివరి నిమిషం వరకూ ఏ జరుగుతుందో తెలియట్లేదని, అంతా అయిపోయిన తరువాత.. లోపాలు బహిర్గతమౌతున్నాయని అంటూ ట్వీట్ చేశారు. ఇదివరకు మధ్యప్రదేశ్, ప్రస్తుతం రాజస్థాన్ల్లో అందివచ్చిన అధికారాన్ని ప్రత్యర్థులకు ధారపోయాల్సి వస్తోందనే ఆవేదన ఆయనలో వ్యక్తమౌతోందని అంటున్నారు. సాయంత్రం సోనియాగాంధీతో జరిగే సమావేశంలో అహ్మద్ పటేల్తో కలిసి ఆయన కూడా పాల్గొనవచ్చని తెలుస్తోంది.