చప్పట్లు కొట్టడం వల్ల ఫాయిదా ఉండదు... మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్..
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. వర్తక,వాణిజ్య వ్యాపారలన్నింటిని కరోనా కుదేలు చేస్తోంది. మరీ ముఖ్యంగా చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు,చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అన్ని వ్యాపారాలకు.. మరీ ముఖ్యంగా చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయా సెక్టార్ల పరంగా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్యాకేజీతో పాటు పన్ను మినహాయింపులు,వడ్డీ రాయితీ ప్రకటించాలని ప్రధానిని కోరారు. పన్ను చెల్లింపులు,ఇతరత్రా గడువులను కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక వేతన జీవుల కోసం ప్రభుత్వం,ఆర్బీఐ ఈఎంఐల వాయిదాను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ రూపంలో తీవ్రమైన దాడి జరిగిందన్నారు. కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజలకు ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 'కరోనావైరస్ మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు, రోజువారీ కూలీ కార్మికులు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. కాబట్టి కేవలం చప్పట్లు కొట్టమని చెప్పడం వల్ల వారికి ఏమీ ఒరగదు. నగదు సహాయం, పన్ను మినహాయింపులు, రుణాల గడువు పెంచడం వంటి సత్వర చర్యలు అవసరం' అని ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాంగంగా ఇంత క్లిష్ట సమయంలోనూ మనకోసం పనిచేస్తున్న డాక్టర్లు,నర్సులు,మీడియా ప్రతినిధులు,పారిశుద్ధ్య కార్మికులు,డెలివరీ బాయ్స్ వంటి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు.. ఆదివారం సాయంత్రం 5గంటలకు ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఆ చప్పట్లు కొట్టం ద్వారా ప్రజలకు ఏమీ ఒరగదని.. కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొనడం గమనార్హం.