జేఎన్యూలో మళ్లీ రగడ: విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన హైదరాబాదీ
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ కూటమి గెలుపొందింది. ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే జేఎన్యూలో గొడవలు జరిగాయి. లెఫ్ట్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.
దీనిపై కొత్త అధ్యక్షుడు సాయి బాలాజీ మాట్లాడుతూ.. ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. మరోవైపు ఏబీవీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పదిహేను నుంచి ఇరవై మంది వరకు లెఫ్ట్ కార్యకర్తలు, విద్యార్థులు కాని వారు కర్రలతో వచ్చారని, దాడి చేశారని ఆరోపించారు.
జేఎన్యూ ఎన్నికల్లో హైదరాబాదీ గెలుపు
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఐక్య వామపక్షాల కూటమి గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఓ హైదరాబాదీ కూడా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకుడు, రీసెర్చ్ స్కాలర్ ఎన్ సాయిబాలాజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమి (యునైటైడ్ లెఫ్ట్) విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో సాయిబాలాజీ సహా 4 కేంద్ర ప్యానెళ్లను సొంతం చేసుకుంది. ఈ కూటమికి ఏబీవీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఉపాధ్యక్షుడిగా సారిక చౌదరి (డీఎస్ఎఫ్), ప్రధాన కార్యదర్శిగా ఎజాజ్ అహ్మద్ రాథర్ (ఎస్ఎఫ్ఐ), సంయుక్త కార్యదర్శిగా అముత జయదీప్ (ఏఐఎస్ఎఫ్) ఎన్నికయ్యారు.