రణరంగంగా దేశ రాజధాని: రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: రాళ్ల దాడి: టియర్ గ్యాస్ ప్రయోగం..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని మరోసారి భగ్గుమంది. రణరంగంగా మారిపోయింది. హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. దేశ రాజధాని నడిబొడ్డున రాళ్ల దాడి ఘటన సంభవించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న ఆందోళనకారులపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిరసనకారులపై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిగా ఆందోళనకారులు కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వారిని చెదరగొట్టడానికి ఢిల్లీ పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఫలితంగా- తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video
జఫ్రాబాద్, మౌజ్పూర్లల్లో ఉద్రిక్తత..
ఢిల్లీ జఫ్రాబాద్ సమీపంలోని మౌజ్పూర్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు కొద్దిరోజులుగా తరచూ జఫ్రాబాద్, మౌజ్పూర్, షహీన్బాగ్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తున్నారు. 500 మందికి పైగా ఆందోళనకారులు షహీన్ బాగ్ తరహాలో జఫ్రాబాద్ మెట్రో రైల్వేస్టేషన్ సముదాయం కింద శనివారం అర్ధరాత్రి నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు.
మరో వర్గం రాళ్లదాడి..
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలుగా ప్రయత్నించారు. సాయంత్రం 5 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకారులపై రాళ్లు రువ్వవారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జీ చేశారు. లాఠీ ఛార్జీ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. తమపై రాళ్ల వర్షాన్ని కురిపించిన వారిపై ఆందోళనకారులు కూడా దాడికి దిగారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మరో వర్గం వారిపై పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. లాఠీఛార్జీకి దిగారు.
రణరంగంగా మారిన సంఘటనా స్థలం..
రాళ్ల దాడి, టియర్ గ్యాస్ ఘటనతో జఫ్రాబాద్, మౌజ్పూర్ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. యుద్ధ వాతావరణాన్ని మరిపించాయి. టియర్ గ్యాస్ను ప్రయోగించిన అనంతరం ఆందోళనకారులు చెల్లాచెదురు అయ్యారు. తెగిన చెప్పులు, టియర్ గ్యాస్, రాళ్ల కుప్పలతో సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. సమాచార అందుకున్న వెంటనే మరిన్ని పోలీసు బలగాలను మౌజ్పూర్ ప్రాంతానికి తరలించారు.
అదుపులోకి తీసుకొస్తున్నామంటూ
రాళ్ల దాడి చోటు చేసుకున్న విషయాన్ని ఢిల్లీ తూర్పు ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే తాము అదనపు పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపించామని అన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని చెప్పారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. హింసాత్మక వాతావరణానికి దిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.