బెంగాల్లో మారని సీన్.. ఆరో విడతలో ఆగని హింస..
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల ఆరోదశలోభాగంగా బెంగాల్లో 8 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. గత ఐదు దశల్లో ఎన్నికల రోజు హింస చెలరేగిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత పెంచింది. అయినప్పటికీ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అటు యూపీ సుల్తాన్పూర్లోనూ బీజేపీ, మహాకూటమి అభ్యర్థుల మధ్య వాగ్వాదంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..
కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి
ఘటాల్లో లోక్సభ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంత బీజేపీ అభ్యర్థి భారతీఘోష్పై తృణమూల్ మహిళా కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో భారతి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈలోగా భారతి వాహనంపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక టీఎంసీ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే భారతీ ఘోష్ సెల్ఫోన్తో పోలింగ్ బూత్లోకి ప్రయత్నించి వీడియో తీసే ప్రయత్నం చేశారని టీఎంసీ ఆరోపించింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది.
బీజేపీ కార్యకర్త హత్య
ఇదిలా ఉంటే ఆరో దశ పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఝార్గామ్ జిల్లాలో బీజేపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. గోపీబల్లబ్పూర్కు చెందిన బూత్ కన్వీనర్ రమణ్సింగ్ మృతదేహాన్ని శనివారం అర్థరాత్రి పోలీసులు గుర్తించారు. రమణ్ సింగ్కు తృణమూల్ కార్యకర్తలే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ బూత్ కన్వీనర్ అయినందునే ఆయన ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్యచేశారని అన్నారు. ఇదిలా ఉంటే తూర్పు మిడ్నాపూర్లోని బాగ్బన్పూర్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
యూపీలో బీజేపీ - కూటమి మధ్య ఫైట్
ఆరో విడత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పూర్ నియోజకవర్గంలో వివాదం చోటుచేసుకుంది. మహాకూటమి అభ్యర్థి సోనూ సింగ్తో బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ వాగ్వాదానికి దిగారు. మహాకూటమి అభ్యర్థి అనుచరులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సోనూసింగ్ అనుచరులు మేనకాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.