150 స్కూళ్లలో ఒక్కరూ పాస్ అవలేదు: మా ఘనతే అన్న సీఎం యోగి
లక్నో: గతేడాదితో పోలిస్తే ఉత్తరప్రదేశ్ లో 10,12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. దాదాపు 150స్కూళ్లలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. చూడటానికి ఇదంతా విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్ లా కనిపిస్తున్నా.. కాదు, అది మా ఘనత అని చెబుతున్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
పరీక్షల్లో కాపీయింగ్ ను అరికట్టినందువల్లే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పడిపోయిందని, ఆవిధంగా తమ సర్కార్ విజయం సాధించినట్టేనని చెబుతున్నారు. పరీక్షల్లో చీటింగ్ అరికట్టడం ద్వారా జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చామని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు 10లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 10వ తరగతి ఉత్తీర్ణత 81.2శాతం ఉంటే, ఈ ఏడాది అది 71.6శాతానికి పడిపోయింది. అలాగే 12వ తరగతి ఉత్తీర్ణత కూడా 82.6శాతం నుంచి 72.43శాతానికి పడిపోయింది.
దాదాపుగా అన్ని పరీక్ష కేంద్రాల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారని, పోలీసులు కూడా విద్యార్థులు స్వేచ్ఛగా, మరింత ఉన్నతంగా పరీక్ష రాసేందుకు సహకరించారని యోగి చెప్పుకొచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారంతా ఎలాంటి చీటింగ్ లేకుండా ఉత్తీర్ణులయ్యారని ప్రశంసించారు.