హోంవర్క్ చేయమంటే కత్తితో పొడిచాడు. ఎవరినీ, ఎక్కడో తెలుసా..!!
రోహ్తక్ : సమాజ పోకడో.. ఇతరుల ప్రభావమో తెలియదు కానీ, విద్యార్థుల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్ దురుసుగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిచోట్ల బ్యాగులో కత్తి తీసుకొని వస్తుండటం పరిస్థితికి అద్దం పడుతుంది. విద్యార్థి దశలోనే దాడులకు తెగబడుతుండటంతో భావి భారత నిర్మాతలు పయనం ఎటువైపోననే ప్రశ్న తొలచివేస్తోంది. తాజాగా హర్యానాలో ఓ విద్యార్థి, విద్యాబుద్దులు చెప్పే టీచర్పై దాడికి తెగబడ్డాడు.
ఎందుకీలా ..?
రోహ్తక్ జిల్లా భిగన్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడుస్తోంది. అందరు విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. కానీ 16 ఏళ్ల విద్యార్థిలో మాత్రం నేర స్వభావం పెరిగింది. అతనికి సరిగ్గా చదవమని చెప్పడమే టీచర్ పాపమైపోయింది. ఇదివరకు ఒకసారి తిట్టిందని మనసులో పెట్టుకున్నాడు. మరో సమయం కోసం చూశాడు. ఇందుకోసం తన హోంవర్క్ చేయలేదు. ఇంకేముంది ముఖేశ్ కుమారి (45) అనే టీచర్ .. ఎందుకు హోం వర్క్ చేయలేదని అడిగింది. దీంతో అప్పటికే తన బ్యాగులో తెచ్చుకున్న కత్తితో టీచర్పై దాడిచేశాడు. కడుపులో మూడుసార్లు పొడిచాడు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో తరగతి గదిలోని విద్యార్థులు నిశ్చేష్టులయ్యారు. భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థుల అరుపులతో మిగతా టీచర్లు ఘటనాస్థలికి హుటహుటిన చేరుకున్నారు.
పారిపోలేదు ..?
వెంటనే టీచర్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఖాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం రోహ్తక్ తరలించారు. టీచర్ను కత్తితో పొడిచిన విద్యార్థి మాత్రం అక్కడే ఉన్నాడు. ఎలాంటి భయం లేకుండా ఉన్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీచర్ను పొడిచిన విద్యార్థి పారిపోయేందుకు ప్రయత్నించలేదని ప్రిన్సిపల్ నీరజ్ త్యాగి పేర్కొన్నారు. విద్యార్థి దాడికి సంబంధించి తోటి టీచర్లు భయపడ్డారు. అయితే ఇదివరకు అతను సరిగా చదవలేదని అందుకే కుమారి మేడమ్ తిట్టారని చెప్పారు. ఆ తర్వాత టీచర్తో కూడా దురుసుగా మాట్లాడేవారని .. తమతో మేడం చెప్పారని తెలిపారు. ఇక హోంవర్క్ చేయకపోవడం .. మేడమ్ అడగడంతో కత్తితో దాడికి తెగబడ్డారని భయపడుతూనే మీడియాకు వివరించారు.
పేరెంట్స్ షాక్
విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని షార్ట్ టెంపర్ అని, క్షణికావేశానికి గురవుతారని డీఎస్పీ విరేందర్ రావు పేర్కొన్నారు. అంతేకాదు చిన్న చిన్న విషయాలపై కూడా టీచర్లతో వాగ్వివాదానికి దిగుతారని గుర్తుచేశారు. పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనపై విద్యార్థి పేరెంట్స్ షాక్కు గురయ్యారు. తమ బాబు దాడి చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు. అంతేకాదు తమ వద్ద ఈ విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదని చెప్పారు.