BoysLockerRoom : ఢిల్లీలో విద్యార్థి ఆత్మహత్య.. తీగ లాగుతున్న పోలీసులు..
ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోని గురుగ్రామ్లో 12వ తరగతి విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. డీఎల్ఎఫ్ ఫేజ్-5లోని ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం(మే 5) రాత్రి 11గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
లాకర్ రూమ్ వ్యవహారంతో లింకు..?
ఇటీవల ఢిల్లీలో వెలుగుచూసిన 'బాయ్స్ లాకర్ రూమ్' వ్యవహారంతో బాలుడికి లింకు ఉందేమోనని అనుమానిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
బాలుడి సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన సమాచారం,చాటింగ్ వివరాల కోసం సైబర్ క్రైమ్ సెల్ విభాగాన్ని కూడా సంప్రదించినట్టు చెప్పారు. తద్వారా అతని క్యారెక్టర్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మరో ఐదుగురిని విచారించిన పోలీసులు
బాయ్స్ లాకర్ రూమ్ వ్యవహారంలో 15 ఏళ్ల బాలుడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు తాజాగా మరో ఐదుగురు పదో తరగతి,12వ తరగతి విద్యార్థులను విచారించారు. వారి తల్లిదండ్రుల సమక్షంలోనే దాదాపు ఆరు గంటల పాటు వారిని విచారించారు. స్కూల్ స్నేహితులే తమను ఆ గ్రూపులో యాడ్ చేశారని ఆ విద్యార్థులు పోలీసులకు వెల్లడించారు.ఇన్స్టాగ్రామ్లోని ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న మరో 21 మంది విద్యార్థులకు కూడా నోటీసులు జారీ చేశారు. త్వరలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
గ్రూప్ అడ్మిన్స్ను అరెస్ట్ చేసే అవకాశం..
బాయ్స్ లాకర్ రూమ్ వ్యవహారంపై సైబర్ క్రైమ్ సెల్ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ గ్రూప్ అడ్మిన్స్ ఎవరన్నది నిర్దారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వారిని అరెస్ట్ చేసే అవకాశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 15 ఏళ్ల బాలుడిని ఇంకా జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచలేదని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించామని.. అయితే సిటీ వదిలి వెళ్లిపోవద్దన్న షరతుతోనే పంపించామని చెప్పారు.
Recommended Video
అరెస్టయిన బాలుడు ఏం చెప్పాడు..
ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. తాను ఆ గ్రూపుకు అడ్మిన్ని కాదని ఆ బాలుడు సైబర్ సెల్ పోలీసులకు తెలిపాడు. మార్చి చివరి వారంలో ఎవరో క్లాస్మేట్స్ తనను ఆ గ్రూపులో యాడ్ చేసినట్టు చెప్పాడు. కొద్దిరోజులకే ఆ గ్రూపులో 51 మంది చేరారని.. ఆ తర్వాత మరో గ్రూపు క్రియేట్ చేశామని చెప్పాడు. అందులో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ఫోటోలను డౌన్ లోడ్ చేసి.. తమ గ్రూపుల్లో పోస్ట్ చేసేవారని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ గ్రూపు సభ్యుల వివరాలు అందజేయాల్సిందిగా ఇన్స్టా యాజమాన్యాన్ని కోరినట్టు ఢిల్లీ పోలీస్ అడిషనల్ పీఆర్వో అనిల్ మిట్టల్ స్పష్టం చేశారు.