ఐదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్: ఆపై నిప్పు పెట్టి హత్య
గౌహతి: అస్సాంలో దారుణ సంఘటన జరిగింది. ఐదో తరగతి బాలికపై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నిప్పు పెట్టి చంపేశారు. ఆ ముగ్గురు కూడా బాలికకు తెలిసినవారే. శుక్రవారంనాడు అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నిప్పు పెట్టడంతో 90 శాతం కాలిన గాయాలతో అస్పత్రిలో చేరిన బాలిక శుక్రవారం రాత్రి మరణించింది. ఆస్పత్రిలో చేరిందని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు బాలురు తనపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారని బాలిక పోలీసులకు చెప్పింది.
ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ముగ్గురు బాలురు కూడా మైనర్లే. దాంతో వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయనున్నారు.
తాము బాలిక మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశామని, దాని ఆధారంగా ఇద్దరిని పట్టుకున్నామని, వారిని కోర్టు ముందు ప్రవేశపెడుతామని పోలీసులు చెప్పారు. గాయాలు తీవ్రంగా ఉన్నందున అత్యాచారాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయలేదు.