ఫేస్బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్లో నిరంతరం చాటింగ్ చేయొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నాయిని ప్రాంతంలోని పరాస్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ ద్వారా తన స్నేహితులతో చాటింగ్ చేస్తున్నాడు. గంటల తరబడి చాటింగ్ చేయడంతో తండ్రికి కోపమొచ్చింది.
గంటల తరబడి చాటింగ్ చేయొద్దని తండ్రి తన కుమారుడ్ని మందలించాడు. దీంతో క్షణికావేశానికి గురైన అతని కుమారుడు తన గదిలోకి వెళ్లి తుపాకితో కాల్చుకున్నాడు. పెద్దగా శబ్దం రావడంతో గదిలోకి వెళ్లి చూడగా కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అతడ్ని కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ మృతుడి తండ్రిదని తెలిపారు. మృతుడి తండ్రి ఓ న్యాయవాదని తెలిపారు.