మంత్రిపై ఫేస్బుక్లో కామెంట్లు: ఇంటర్ విద్యార్ధి అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
లక్నో: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి సమాజ్వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి అజం ఖాన్పై సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్లు పోస్ట్ చేసినందుకు గాను ఉత్తర ప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్ధి మంత్రి అజం ఖాన్పై పేస్బుక్లో ఫేక్ కామెంట్లు పోస్టు చేశాడు. విద్యార్ధి చేసిన కామెంట్లు హిందువులు, ముస్లింల భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆజంఖాన్ పీఆర్ఓ పసహత్ అలీ ఖాన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన రాంపూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ విద్యార్థి నివాసానికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజ్ కొట్వాలి అవుట్ పోస్ట్లో ఉంచి, అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఆజంఖాన్ పీఆర్ఓ పసహత్ అలీ ఖాన్ వెల్లడించారు.
ఫేస్బుక్లో వివాదాస్పద ఫేక్ కామెంట్లను అప్లోడ్ చేయడంతో ఆ విద్యార్థిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (66ఏ) కింద కేసు నమోదు చేసినట్లు రాంపూర్ ఎస్పీ సాధ్నా గోస్వామి తెలిపారు. తాను ఫేస్బుక్లో పోస్టు చేసిన దాని ఉద్దేశ్యం వేరని పోలీసుల విచారణలో ఆ విద్యార్ధి వెల్లడించినట్లు తెలిపారు.