లైంగిక వేధింపుల ఆరోపణలపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు క్లీన్ చిట్ ఇచ్చిన త్రిసభ్య కమిటీ
ఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ త్రిసభ్య కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపులు రావడంతో ఆయనే స్వయంగా ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేశారు. ఈ ప్యానెల్కు జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వం వహించారు. ఇక విచారణ పూర్తి అయ్యిందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు ఆ తర్వాత సీనియర్ జడ్జికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు.అయితే ఇది అనధికారిక విచారణ కాబట్టి దీన్ని నివేదికను బహిరంగ పర్చలేమని త్రిసభ్య కమిటీ పేర్కొంది.
ఇక విచారణ చేసిన కమిటీ... ఏప్రిల్ 19న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని తేలిందని సుప్రీం కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ప్యానెల్లో జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందు మల్హోత్రాలు మిగతా ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో పని చేసే మహిళా మాజీ ఉద్యోగిని జస్టిస్ రంజన్ గొగోయ్ తనను రెండు సార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంటూ 22 మంది సుప్రీంకోర్టుల జడ్జీలకు అఫిడవిట్ సమర్పించింది. గతేడాది అక్టోబరులో చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను లైంగికంగా వేధించాడని తన అఫిడవిట్లో ఆ మహిళ పేర్కొంది. ఈ విషయం బయటపెట్టడంతో తనను ఉద్యోగం నుంచి తొలిగించారని పేర్కొంది. అంతకుముందు జస్టిస్ గొగోయ్ నివాసంలో క్లర్క్గా ఆమె పనిచేశారు.