క్లీన్ గంగా కోసం: 111రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి మృతి చెందిన స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్
గంగా నది పరిశుభ్రత కోసం గత 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 87 ఏళ్ల పర్యావరణవేత్త ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ అలియాస్ స్వామి జ్ఞాన్స్వరూప్ సనంద్ హరిద్వార్లో తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో మైత్రీ సదన్ నుంచి ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలకు మృతి చెందారు. చివరిసారిగా సనంద్ తాను మీడియాకు ఓ లేఖ రాశారు. తన రక్తంలో పొటాషియం తగ్గిపోతుందని తెలిపారు. అయితే నోటిద్వారా పొటాషియంను తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు.
గంగా నది ప్రవాహం ఎక్కడా ఆగకుండా జరగాలని... గంగానది పరివాహక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అన్ని రకాల హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్ అగర్వాల్ ఈ ఏడాది జూన్ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గంగా పరిరక్షణ మరియు నిర్వహణ చట్టం తీసుకురావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
యూపీఏ హయాంలో ఏర్పాటైన నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీలో స్వామి సనంద్ సభ్యునిగా కూడా కొనసాగారు. 2010లో భగీరతి నదిపై నిర్మితమవుతున్న 600 మెగా వాట్ల లొహరి నాగపాల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 38 రోజుల పాటు దీక్ష చేవారు. ఈ ప్రాజెక్టు వల్ల నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతోందని అన్నారు. ఆ తర్వాత ముగ్గురు సభ్యులతో కూడిన మంత్రుల బృందం ఈ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే గంగానది పరిశుభ్రతను కోరుతూ ఆమరణ దీక్ష చేసి మృతి చెందిన వారిలో ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ రెండో వ్యక్తి. అంతకు ముందు అంటే 2011లో మాత్రి సదన్కు చెందిన 36 ఏళ్ల స్వామి నిగమానంద రెండు నెలల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మృతి చెందారు.