కాశీలో రామోజీ రావు, గంగూలీని నామినేట్ చేసిన మోడీ, రైల్వేలపై..
వారణాసి: స్వచ్ఛ భారత్ కోసం అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని, దీనిని అందరు కలిసి ముందుకు నడిపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా మోడీ ఈ రోజు తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు.
ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో వారణాసి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఆయన మదన్ మోహన్ మాలవ్యా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశ అభివృద్ధిలో సుపరిపాలన అత్యంత కీలకమైనదన్నారు. పౌరులకు పారదర్శకమైన పాలన, ఉత్తమ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆయన అస్సీ ఘాట్ను సందర్శించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పైన మీడియాతో మాట్లాడారు.
అస్సీ ఘాట్ కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, వారణాసీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్చ భారత్ కార్యక్రమానికి పలువురిని నామినేట్ చేశారు. ఈసారి తాను వ్యక్తిగతంగా, కంపెనీలను స్వచ్ఛ భారత్కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మ, డ్యాన్సర్ సోనాల్ మాన్సింగ్, ఇండియా టుడే చైర్మన్ అరుణ్ పురి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా, ముంబై డబ్బావాలాలను నామినేట్ చేశారు.
రైల్వేలను ప్రయివేటీకరించం: మోడీ
ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. రైల్వేలను ప్రయివేటీకరించమని చెప్పారు. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర అని, భారత రైల్వే లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. దేశంలో నాలుగు రైల్వే విశ్వవిద్యాలయాలు రావాల్సి ఉందన్నారు.