టూల్ కిట్ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్..దిశ రవి అరెస్ట్: 81రోజులుగా
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి న్యూఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతు నిరసన దీక్షల్లో సంచలనం చోటు చేసుకుంది. అనూహ్య పరిణామం సంభవించింది. రైతు దీక్షలతో ముడిపడి ఉన్న వివాదాస్పద టూల్ కిట్ వ్యవహారంలో.. దిశ రవి అరెస్ట్ అయ్యారు. గెటా థెన్బర్గ్ చేసిన టూల్కిట్ వివాదంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి పెద్దిరెడ్డిని నియోజకవర్గంపై టార్గెట్: ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ఆరా: పుంగనూరుకు
దిశ రవి.. బెంగళూరుకు చెందిన 21 సంవత్సరాల సామాజిక కార్యకర్త. వాతావరణ మార్పులపై ఆమె పని చేస్తోన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే దుష్ప్రభావాలు, వాటి పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తరచూ సదస్సులను నిర్వహిస్తుంటారు. దీనికోసం ఆమె ప్రత్యేకంగా ఫ్రైడే ఫర్ ఫ్యూయర్ అనే సంస్థను నెలకొల్పారు. బెంగళూరులో ఓ టాప్ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీలో కలినరీ మేనేజర్గా పనిచేస్తోన్నారు. అక్కడే నివసిస్తోన్నారు. గెటా థెన్బర్గ్ చేసిన టూల్ కిట్ ట్వీట్తో ఆమెకు ప్రమేయం ఉన్నట్లు తేలడంతో దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతు ఉద్యమానికి సంఘీభావాన్ని తెలుపుతూ గెటా థెన్బర్గ్ చేసిన తొమ్మిది పేజీల ట్వీట్.. అందులో పొందుపరిచిన టూల్ కిట్ వ్యవహారం దేశంలో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఢిల్లీ పోలీసులు గెటా థెన్బర్గ్కు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ టూల్ కిట్ వ్యవహారంలో దిశ రవి అరెస్ట్ కావడం పట్ల సామాజిక కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. దేశద్రోహం కింద గెటా థెన్బర్గ్పై నమోదు చేసిన 124ఎ, 120ఎ, 153ఎ సెక్షన్లను ఆమెపై వర్తింపజేయొచ్చనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
మరోవంక- మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేస్తోన్న ఉద్యమాలు 81వ రోజుకు చేరుకున్నాయి. భారత్ కిసాన్ యూనియన్ సహా పలు రైతు సంఘాల సారథ్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో- ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. రైతులు ఢిల్లీ నగరంలోనికి ప్రవేశించకుండా సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ-హర్యానాలను అనుసంధానించే టిక్రీ సరిహద్దులను మూసివేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీసులు ఈ సరిహద్దులో మోహరించారు.