డేంజర్ బెల్స్: వాతావరణంలో మార్పులతోనే ఈ భారీ విపత్తులు
ప్రకృతి ప్రకోపానికి కేరళ అల్లాడిపోయింది. అది సృష్టించిన విలయతాండవానికి ఇటు మనుషులు అటు పశుపక్షాదులు చెల్లా చెదురయ్యాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేని ఈ భారీ విపత్తు ధాటికి దేవభూమి తల్లడిల్లిపోయింది. ఇప్పుడు వరదల ధాటికి జరిగిన విధ్వంసం భవిష్యత్తులో కూడా జరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు కారణం మానవ తప్పిదాలే అని వారు చెబుతున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్తో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయని హెచ్చరిస్తున్నారు.
నైరుతి రాష్ట్రమైన కేరళలో ప్రతి ఏటా వచ్చే రుతుపవనాలపైనే అక్కడి రైతులు ఆధారపడతారు. కానీ ఈ సారి వచ్చిన వర్షాలు ఏకంగా రైతన్నకు కన్నీటినే మిగిల్చాయి. సాధారణ వర్షపాతం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా వర్షాలు కురవటం...దాని పర్యావసానంగా వరదలు ముంచెత్తడం కేరళ రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఇది కూడా వాతావరణంలో మార్పుల వల్లే జరిగిందని భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి విపత్తును వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతోనే సంభవించిందని కూడా చెప్పలేమని ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియారాలజీలో వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. అదేసమయంలో 1950 నుంచి 2017 మధ్య మూడంచెల పెరుగుదలతో వర్షపాతం నమోదైనట్లు తమ వద్ద ఉన్న సమాచారం చెబుతోందని దీనివల్లే పెద్ద ఎత్తున వరదలు వచ్చినట్లు చెప్పారు.
భారత్లో భారీ వర్షాల ద్వారా సంభవించిన వరదలకు దేశవ్యాప్తంగా 69వేల మంది మృతి చెందారని, 17 మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారని ఓ నివేదిక వెల్లడించింది. ఇక కేరళలో 35 డ్యాముల్లో.. భారీ వర్షాలకు ప్రధాన రిజర్వాయర్లు నిండిపోవడంతో తప్పని పరిస్థితుల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే గత 26 ఏళ్లలో ఎప్పుడూ తెరుచుకోని ఇడుక్కి డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని లోతట్టు ప్రాంతాలకు విడుదల చేశారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులవల్లే ప్రస్తుతం కేరళలో వరదలు పోటెత్తాయని కిరా వింకే అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎవరి ఊహకు అందని భారీ విపత్తు భవిష్యత్తులో వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు.
అరేబియా సముద్రం, దాని చుట్టుపక్కన భూపరిసరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలి వానలు సంభవిస్తాయని అవి మూడు నాలుగు రోజుల వరకు ఉంటాయని ఇది కూడా వాతావరణంపై ప్రభావం చూపే అవకాశముందన్నారు శాస్త్రవేత్త కోల్. ఆసమయంలో అరేబియన్ సముద్రంలో తేమ శాతం కుచించుకుపోతుందని ఆయన వివరించారు.
గత దశాబ్దంలో భూతాపం పెరిగిపోవడం వల్ల మధ్య భారత దేశం, దక్షిణ భారత దేశాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మరో శాస్త్రవేత్త ఎలీనా తెలిపారు. భూమిపై నమోదైన ఉష్ణోగ్రత పెరుగుదల తర్వాతే ఇలాంటి విపత్తులు సంభవించినట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం సందర్భంగా జరిగిన సమావేశంలో కూడా 196 దేశాలు భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.
ఒక్క వరదలే భారత్లో సమస్యలకు కారణం కావడం లేదు... పెరుగుతున్న జనాభాతోపాటు గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుండటం తద్వారా వాతావరణంలో మార్పులతో విపత్తులు జరుగుతున్నాయని చెప్పారు. భారత్లో వాతావరణం కూడా వర్షాకాలంలో భారీ వర్షాలు... వేసవి కాలంలో ఎర్రని ఎండలు ఉంటాయని వింకి చెప్పారు.
ఇక
మానవ
తప్పిదాలను
నియంత్రించకుంటే...
అంటే
వాతావరణంలోకి
కార్బన్
ఉద్గారములు
తగ్గించలేక
పోతే
ఈశాన్య
భారతంలో
నివసించేందుకు
కూడా
చాలా
కష్టంగా
మారుతుందని
శాస్త్రవేత్తలు
హెచ్చరిస్తున్నారు.
సముద్రం
మట్టం
పెరిగిపోవడం
వల్ల
కోస్తా
తీరంలో
ఉన్న
నగరాలకు
ప్రమాదం
వాటిల్లుతుందని
చెబుతున్నారు.