భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా..
హైదరాబాద్: భారతదేశంలో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి. ఈ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాల కోసం కావాల్సిన అనుమతులను సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీ నుంచి పొందినట్లు తెలిపాయి.
స్పుత్నిక్ వీ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం..
జీఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలు నిర్వహిస్తుననట్లు వెల్లడించాయి. ప్రయోగాల సలహా కోసం భారత బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టాన్స్ కౌన్సిల్(బీఐఆర్ఏసీ)తో కలిసి పనిచేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. బీఐఆర్ఏసీకు చెందిన ప్రయోగ కేంద్రాలను కూడా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా రెండో దశలో 100 మంది, మూడో దశ కోసం మరో 1400 మంది వాలంటీర్లను నియమించుకున్నట్లు తెలిసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగాలను 40వేల మందిపై జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
10 కోట్ల డోసుల సరఫరాకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
కాగా, వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టడంలో ఇది ఒక కీలక మైలురాయి అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ కో-ఛైర్మన్, ఎండీ జీవీ రమణ వ్యాఖ్యానించారు. భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టడంతోపాటు 10 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
Recommended Video
కరోనాను ఎదుర్కోవడంలో సమర్థంగా స్పుత్నిక్ వీ..
ఇది ఇలావుంటే, స్పుత్నిక్ వీపై రష్యాలో ఇప్పటికే ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో వ్యాక్సిన్ 91.4శాతం సమర్థతో పనిచేస్తున్నట్లు రెండో మధ్యంతర నివేదికను ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలిపింది. ఈ వ్యాక్సిన్ కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచి ఎక్కువ కాలం కలిగి ఉండేలా చేస్తుందని వెల్లడిచింది. సాధారణ ఉష్ణోగ్రతలోనే ఈ టీకాలను నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది.