మూడు దేశాలు కలిస్తే అద్బుతం: దలైలామా
బెంగళూరు: భారత్, అమెరికా, జపాన్ దేశాల మధ్య కొన్ని అంశాలలోని విషయంలో చాల దగ్గర సంబంధాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. ఈ మూడు దేశాలు అనుసరిస్తున్న తీరుతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని గుర్తు చేశారు.
ఈ మూడు దేశాలు భావప్రకటనా స్వేచ్చ, స్వేచ్చాయుత పరిపాలన, ప్రజాస్వామ్యం తదితర అంశాలలో ఒకే విధమైన అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఈ దేశాలు సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం చాల ముఖ్యం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కర్ణాటక పర్యటనలో ఉన్న దలైలామా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. నేను తరచుగా పదే పదే చెబుతుంటాను. మొత్తం ఆసియాలోనే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కలిగి స్థిరంగా కొనసాగుతున్న ఏకైక దేశం భారతదేశమే అని అన్నారు.
అలాగే అమెరికా ఒక స్వేచ్చా ప్రపంచం అన్నారు. అమెరికాలో సమానాత్వం వర్ధిల్లుతుందని చెప్పారు. జపాన్ పారిశ్రామిక రంగంలో అభివృద్ది చెందిన ప్రజాస్వామ్య దేశం అన్నారు. ఈ మూడు దేశాలు కచ్చితంగా చివరి వరకు కలిసే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక చైనా విషయానికి వస్తే నిరంకుశ ప్రభుత్వాన్ని కలిగిన దేశంగా అభివర్ణించారు. అయితే చైనా గొప్పదేశం, అక్కడి ప్రజలు చాల గొప్పవారని చెప్పారు. చైనా ప్రజలు కష్టపడి పని చేసే తత్వాన్ని తాము ఎప్పటికీ గౌరవిస్తామని దలైలామా వివరించారు. చైనా నిరంకుశాన్ని విడిచిపెట్టాలని సూచించారు.