ఉత్తరాదికి వాతావరణ హెచ్చరిక: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో 22 మంది మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాదిన బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో భారీ వరదరలు వచ్చాయి. దీంతో 22 మంది మృతి చెందారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) హుటాహుటిన రంగంలోకి దిగి ఆపదలో ఉన్న అనేకమందిని కాపాడింది. సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
మహారాష్ట్రలో 213 మంది మృతి.. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటి వరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. రాయిగడ్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలు భారీ నష్టమే కలిగించాయి. సతారా, రత్నగిరి, కోల్హాపూర్, సంగ్లి జిల్లాల్లో కూడా వర్షాలు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) దేశ రాజధాని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాలతో ఢిల్లీ నగరం అతలాకుతలమైంది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
హిమాచల్ప్రదేశ్లో కుండపోత వర్సాలు, 14 మంది మృతి, రెడ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. మరో నలుగురు వరదల్లో గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సిమ్లాకు వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం కలిగింది.
జమ్మూకాశ్మీర్లో వర్ష బీభత్సం, 8 మంది మృతి, 17 మంది గల్లంతు
మరోవైపు జమ్మూకాశ్మీర్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 8 మంది మరణించారు. మరో 17 మంది వరదల్లో గల్లంతయ్యారు. లడఖ్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 17 మందిని పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్నాథ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్.. మరో 2 రోజులు భారీ వర్షాలు
ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దేశ రాజధానిలో ఇప్పటి వరకు 386.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుర్గావ్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంజాబ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. గురువారం కూడా పంజాబ్, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, దక్షిణ బెంగాల్ ప్రాంతంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలుచోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.