ఆ నరక ద్వారాలను మూసివేయండి: అధికారులకు వార్నింగ్.. సీఎం స్వయంగా 20 లక్షలు..
తమిళనాడులో చిన్నారి సుజిత్ విల్సన్ మరణం దేశవ్యాప్తంగా ఎంతో మందిని విషాదానికి గురిచేసింది. తిరుచి జిల్లాలో మూడేళ్ల సుజిత్ బోరుబావిలో పడి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. సుజిత్ అంత్యక్రియలకు వేలాది మంది హాజరై కన్నీరుమున్నీరయ్యారు. సుజిత్ విషాదం ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నది. ఈ క్రమంలో ఇలాంటి చర్యలు భవిష్యత్లో పునరావృతం కాకుండా తమిళనాడు సరిద్దిద్దే చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి మంగళవారం సంచలన నిర్ణయం తీసుకొన్నారు.
సుజిత్ మరణంతో కదలిక
సుజిత్ లాంటి చిన్నారులు ఇలాంటి దుర్ఘటనకు బలై పోకుండా రాష్ట్రంలోని ఉపయోగించని బోరుబావులను, ట్యూబ్ బావులను వెంటనే పూడ్చివేయాలని.. పాడుబడిన బోరుబావుల ద్వారాలను మూసివేసే చర్యలు తీసుకొండి అని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని స్వయంగా సీఎం పళనిస్వామి పరామర్శించారు. అలాగే ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, పార్టీ తరుఫున మరో రూ.10 లక్షల పరిహారాన్ని అందజేశారు.
సీఎం పళని సీరియస్
అనంతరం సుజిత్ దుర్ఘటన నేపథ్యంలో సీఎం పళనిస్వామి స్పందిస్తూ.. ఉపయోగించని బోరుబావులను మూసివేసే కార్యక్రమానికి ఎన్ఐటీ, ఓఎన్జీసీ, అన్నా యూనివర్సిటీ, ఎల్ అండ్ టీ సంస్థల సహకారం తీసుకొంటాం. ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సరైన చర్యలు తీసుకొంటాం. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు.
అధికారులకు వార్నింగ్
సుజిత్ మరణంపై ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి వేగంగా స్పందించారు. 2015లో జారీ చేసిన గెజిట్ను సూచిస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బోరుబావుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సుజిత్ విషాదం ఇలా...
తిరుచి జిల్లాలోని నాడుకట్టుపట్టి గ్రామానికి చెందిన సుజిత్ శుక్రవారం సాయంత్రం 5.30 నిమిషాలకు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 88 అడుగుల లోతుకు జారిపోయాడు. ఆహారం, నీళ్లు, ఆక్సీజన్ లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమిళ సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. దేశం మొత్తం సుజిత్ ప్రాణాలతో బయటకు రావాలని ప్రార్థించిన భగవంతుడు కరుణ చూపకపోవడంతో తీవ్ర విషాదం వెంటాడిన పరిస్థితి ఎదురైంది.