డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ప్రారంభించిన సీఎం జైరామ్
షిమ్లా: ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా హిమాచల్ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని ప్రారంభించారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్లను సీఎం ప్రారంభించారు. ఈ ర్యాలీలో 29 స్కూల్స్ నుండి దాదాపు 2000ల మంది విద్యార్థులు, పలు ఎన్జిఓలు, ఐటిఐ - నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం విద్యార్థుల చేత డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సీఎం జై రామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ఎన్జీఓ సంస్థలు, విద్యార్థుల తల్లితండ్రులు అందరూ కలిసి ఈ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడినవారికి చైతన్యపరచడానికి పోలీస్ శాఖ చాలా కృషి చేస్తోందని అయన అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆటకట్టించడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంను పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
డ్రగ్ మాఫియాను అరికట్టడానికి 3 నార్కోటిక్ క్రైమ్ యూనిట్స్ షిమ్లా,కంగ్రా, కులు ప్రదేశాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విపిన్ సింగ్ పార్మర్, పరిశ్రమల శాఖ మంత్రి బిక్రమ్ సింగ్ ఠాకూర్, డిప్యూటీ మేయర్ రాకేష్ శర్మ, మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.