మరో రెండు రోజులు..ప్లీజ్: ముఖ్యమంత్రి అభ్యర్థన!
బెంగళూరు: కొద్దిరోజులుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు. అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్- జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమే అయినప్పటికీ.. అది ఎన్నిరోజులనేది స్పష్టంగా తేలియట్లేదు. ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కార్.. శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. గత గురువారం నాడే బలపరీక్షను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని సోమవారానికి నెట్టుకుని వచ్చింది.
ఈ నేపథ్యంలో- శాసనసభలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గల సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికిక తనకు మరో రెండు రోజుల గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ను కోరారు. అసెంబ్లీకి వచ్చిన వెంటనే కుమారస్వామి నేరుగా స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు. రమేష్కుమార్ను కలుసుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు కృష్ణ బైరెగౌడ, హెచ్డీ రేవణ్ణ, ప్రియాంక్ ఖర్గే ఉన్నారు. సుమారు 20 నిమిషాలకు పైగా కుమారస్వామి స్పీకర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారిన 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాల వ్యవహారంతో పాటు బలపరీక్షను నివారించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చ సాగించినట్లు తెలుస్తోంది. అనంతరం- బలపరీక్ష నిర్వహణను మరో 48 గంటల పాటు వాయిదా వేయాలని కుమారస్వామి ఈ సందర్భంగా స్పీకర్ను కోరగా.. ఆయన అప్పటికప్పుడు ఎలాంటి హామీని ఇవ్వలేదని చెబుతున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని కుమారస్వామి ప్రస్తావించగా- అంతకుముందే తాను వారికి సమన్లను జారీ చేశానని స్పీకర్ వివరించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి ఆ 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనను కలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వారు హాజరు కాలేకపోతే- అనర్హత వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ- ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోవడం ఖాయమైతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి తీరాల్సిందేనని అన్నారు.
ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో పాటు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి- వారిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కోరినట్లు చెబుతున్నారు. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని, రాజీనామాల వల్ల ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానాలకు నిర్వహించే ఉప ఎన్నికల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు పోటీ చేయకుండా ఉచ్చు బిగించాలని ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారని అంటున్నారు. కుమారస్వామి కోరిన విధంగా బలపరీక్ష నిర్వహణకు గడువు పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.