CM home town: కర్ఫ్యూ, 144 సెక్షన్ కొనసాగింపు, సొంత ఊరిపై సీఎం డేగకన్ను, ఆ రోజు వరకు అదే సీన్ !
బెంగళూరు/ శివమొగ్గ/ మంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం సొంత జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భజరంగ్ దళ్ నాయకుడి మీద కొందరు దాడులు చెయ్యడంతో గొడవలు మొదలైనాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితి సాదారణ స్థితికి వస్తున్న సందర్బంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. శివమొగ్గలో సోమవారం వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు అన్నారు. సీఎం బీఎస్. యడియూరప్ప సొంత ఊరిపై డేగకన్ను వేసి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.
Karnataka Bandh: బెంగళూరులో హై అలర్ట్, బస్సులపై రాళ్లదాడి, హ్యాండ్ ఇచ్చిన వ్యాపారులు, సీన్ రివర్స్ !
సీఎం ఇలాఖాలో దందా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. మరో వర్గం దాడిలో భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ కు తీవ్రగాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఈ విషయం శివమొగ్గ జిల్లాతో పాటు కర్ణాటక మొత్తం తెలిసిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక్కరి దెబ్బతో శివమొగ్గ హడల్
భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ మీద దాడి చెయ్యడంతో శివమొగ్గ పట్టణంలో ఇరు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమిషాల వ్యవధిలో శివమొగ్గ రణరంగంగా మారడంతో స్థానిక ప్రజలు భయంతో హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడానికి విఫలయత్నం చేశారు. అయినా ఇరు వర్గాలు మాత్రం పోలీసుల మాట వినలేదు.
కర్ఫ్యూతో కూల్
శివమొగ్గ పట్టణంలో పరిస్థితి అదుపు తప్పింది. అదనపు బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు ఇప్పటి వరకు 62 మందిని అరెస్టు చేసి 10 కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా శివమొగ్గ పట్టణంలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో శుక్రవారం రోజు పూర్తిగా కర్ఫ్యూ అమలు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరించడంతో అల్లరిమూకలు వారివారి ఇళ్లకే పరిమితం కావడం, శనివారం పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రజలు కూడా కొంద వరకు ఊపిరిపీల్చుకున్నారు.
కర్ఫ్యూ కొనసాగింపు...... 144 సెక్షన్
శివమొగ్గలోని తుంగానగర, దోడ్డపేట, కోటే పోలీస్ స్టేషన్ ల పరిధిలో సోమవారం ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తామని ఐజీపీ ఎస్. రవి అన్నారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూతో పాటు శివమొగ్గ పట్టణంలో సోమవారం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తహసిల్దార్ ఎన్.జే. నాగరాజ్ స్పష్టం చేశారు. ఇరు వర్గాల వారు శాంతియుతంగా సహనం పాటించే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. సొంత జిల్లా మీద ఓ కన్ను వేసిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని మనవి చేశారు.