కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం, హస్తినలో బండి సంజయ్ హాట్ కామెంట్స్..
మొన్న కేసీఆర్ హస్తిన పర్యటించుకోగా.. నిన్న హస్తిన బాట పట్టారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ వెంటనే కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. కేసీఆర్ అంటే నమ్మే పరిస్థితులో ఎవరూ లేరు అని.. ఆయన త్వరలో జైలుకెళ్లడం ఖాయం అని చెప్పారు. అక్రమాలపై భరతం పడతామని హెచ్చరించారు. తాజాగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారితీశాయి.
కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పామని బండి సంజయ్ గుర్తుచేశారు. వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా క్షమించబోము అని తేల్చిచెప్పారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు చావు దెబ్బ కొట్టిన విషయాన్ని సంజయ్ ప్రస్తావించారు. అయితే లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి అని చెప్పారు.
వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు.
హస్తిన పర్యటనలో ఉన్న బండి సంజయ్ చేసిన హాట్ కామెంట్స్ కలకలం రేపాయి. సంజయ్ కామెంట్స్కు అధికార టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడినట్టుంది. దీనిపై గులాబీ దళం ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేదు. ఆ పార్టీ నేతలు స్పందించాల్సి ఉంది. సీఎం జైలుకెళ్లడం ఖాయమని బండి చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చానీయాంశమయ్యాయి.