ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ.. నిధులపై ప్రధాన చర్చ.. ప్రాజెక్టులపై కూడా..
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్కు వరదసాయం, జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై చర్చించారు. వీరి భేటీ అరగంట పాటు కొనసాగింది.
Recommended Video
పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సహకారం గురించి ప్రధాని మోడీతో కేసీఆర్ డిస్కష్ చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా జరిగింది. కేంద్రమంత్రులతో వరసగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బసంత్ నగర్, మామునూరు, ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం 2018లో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే చేసిందని గుర్తుచేశారు.
విమానాశ్రయాల ఏర్పాటు కోసం సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇవ్వాలని కోరారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు. నిన్న హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ సమావేశమయ్యారు. వరద సాయం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ సడెన్గా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.