తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరేనా..?
హైదరాబాద్ : తెలంగాణలో సెప్టెంబర్ 8వ తేదీ అంటే ఆదివారం రోజున రెండు ప్రమాణా స్వీకారాలు జరగనున్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు తమిళసై సౌందర్ రాజన్ కొత్త గవర్నర్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె ప్రమాణ స్వీకారం పూర్తి అయిన కొద్ది గంటలకే సీఎం కేసీఆర్ తన మంత్రి వర్గ విస్తరణ చేసేందుకు నిర్ణయించారు. సాధారణంగా మంచి రోజు లేదా ముహుర్తం చూసి కార్యక్రమం తలపెట్టే సీఎం కేసీఆర్.. ఆదివారం దశమి కావడంతో సాయంత్రం నాలుగు గంటలకు తన మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఇక మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సీఎస్ ఎస్కే జోషికి ఆదేశాలు ఇచ్చారు. తను మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ఇప్పటికే కాబోయే కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి మంత్రి వర్గ విస్తరణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సబితా ఇంద్రారెడ్డికి కూడా అవకాశం దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్లకు బెర్తు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో 11 మంత్రులు ఉన్నారు.
బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించనున్నారో అనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇక త్వరలోనే కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులను కూడా సీఎం భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్ ఛైర్మెన్లుగా 12 మంది ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ నెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, విప్లను సీఎం కేసీఆర్ ఫైనలైజ్ చేశారు. మొత్తంగా చీఫ్ విప్తో కలిపి ఆరు విప్లను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను నియమించగా, విప్లుగా గొంగిడి సునీత, గంపా గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతరావు, బాల్కసుమన్లను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్.