డాక్టర్ జోగిందర్ కుటంబానికి రూ. కోటి చెక్కును అందజేసిన సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనావైద్య సేవలు అందిస్తూ కన్నుమూసిన వైద్యుడు జోగిందర్ చౌదరి కుటుంబ సభ్యులకు రూ. కోటి పరిహారం ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ క్రమంలోనే ఆయన డాక్టర్ జోగిందర్ కుటుంబ సభ్యులను కలిసి రూ. కోటి చెక్ను అందజేశారు.దాదాపు ఒక నెలరోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన 27 ఏళ్ల డాక్టర్ జోగిందర్ గత వారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు.జూన్ 27న కరోనావైరస్ పాజిటివ్ అని రిపోర్టు రాగా జూన్ 28వ తేదీ నుంచి డాక్టర్ జోగిందర్ చికిత్స పొందారు.
ఇక కుటుంబ సభ్యులను కలిసిన సీఎం కేజ్రీవాల్ డాక్టర్ చౌదరి ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విధానాన్ని కొనియాడారు. అంతేకాదు డాక్టర్ చౌదరి కుటుంబం కోసం ఢిల్లీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని సీఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
విధి నిర్వహణలో భాగంగా కరోనావైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ డాక్టర్ జోగిందర్ ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పిన సీఎం కేజ్రీవాల్... ఆయన ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్లో అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ సిబ్బంది, ఇతర మెడికల్ సిబ్బంది కరోనావైరస్ పై పోరాడుతున్న తీరు భేష్ అని ఈ రోజు వారి కష్టంతోనే ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. అంతేకాదు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడిందని చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో నడిచే డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజ్లో 2019 నుంచి డాక్టర్ జోగిందర్ చౌదరి పనిచేస్తున్నారు. ఆయన ఫ్లూ క్లినిక్లో ఆ తర్వాత కాజువాలిటీ వార్డులో సేవలు అందించారు.జూన్ 23వ తేదీన డాక్టర్ జోగిందర్కు జ్వరం వచ్చింది. నాలుగు రోజుల తర్వాత టెస్టులు చేయించుకోగా తనకు కరోనావైరస్ నిర్థారణ అయ్యింది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందని చెప్పారు. ఆ తర్వాత లోక్నాయక్ జయప్రకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గత వారం తుదిశ్వాస విడిచారు డాక్టర్ జోగిందర్ చౌదరి.