సీఎం కేజ్రీవాల్కు కరోనా నెగటివ్.. ఢిల్లీలో కేసులు 5.5లక్షలకు చేరొచ్చన్న డిప్యూటీ..
రెండు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతూ.. అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకుని హోం క్వారంటైన్ కే పరిమితమైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. వైరస్ భయాల నేపథ్యంలో కేజ్రీవాల్ కు చికిత్స అందిస్తోన్న డాక్టర్లు ఆయన శాంపిళ్లను ల్యాబ్ కు పంపగా.. కరోనా నెగటివ్ గా తేలింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ కు మంగళవారం నాటికి జ్వరం కూడా తగ్గిందని, ప్రస్తుతం చురుగ్గానే ఉన్నారని డాక్టర్లు, ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో బిజీగా ఉన్న కేజ్రీవాల్ ఆదివారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని, ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి కరోనా బారి నుంచి తప్పించుకున్నప్పటికీ దేశ రాజధానిలో వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది..
వైరస్ బాధిత జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోన్న ఢిల్లీలో ఇప్పటికే కేసుల సంఖ్య 30 వేలు దాటింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెల 15 నాటికి కేసుల సంఖ్య 44వేలు దాటొచ్చని, వచ్చేనెల చివరిదాకా(జులై 31 నాటికి) ఆ సంఖ్య 5.5 లక్షలకు చేరొచ్చని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. దేశంలో వైరస్ సామూహిక వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) జరగడంలేదని కేంద్రం చెబుతున్నా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మాత్రం ఈతరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీలో కరోనా వ్యాప్తి, ప్రైవేట్ ఆస్పత్రులపై సిసోడియా మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు.