కర్నాటకం : కొనసాగుతున్న హైడ్రామా.. గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం..
కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్ష విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామి బల నిరూపణకు గవర్నర్ ఎంబీ పాటిల్ ఇచ్చిన రెండో గడువు శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన గడువు మధ్యాహ్నం 1.30గంటలకు ముగిసింది. విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాకుండా ఓటింగ్కు వెళ్లలేమని స్పీకర్ తేల్చి చెప్పడంతో సాయంత్రంలోగా బలం నిరూపించుకోవాలని గడువు విధిస్తూ గవర్నర్ సీఎంకు లేఖ రాశారు.
గవర్నర్ లేఖపై కుమారస్వామి ఆవేదన
బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ రెండో లేఖ రాయడంతో సీఎం కుమార స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ రాసిన రెండో ప్రేమలేఖ బాధించిందని చెప్పారు. ఇక నిర్ణయాన్ని స్పీకర్కే వదలేస్తున్నానని ప్రకటించారు. అటు గవర్నర్ వ్యవహారశైలిపై స్పీకర్ రమేష్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం
బల పరీక్షపై గవర్నర్ జోక్యంపై కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ పదే పదే డెడ్ లైన్లు విధించడం సరికాదని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ పంపిన లేఖలను సవాల్ చేసిన ఆయన.. విశ్వాస తీర్మాన చర్చపై ఆదేశాలు జారీ చేసే అధికారం ఆయనకు లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా గవర్నర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు విప్లపై స్పష్టతనివ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. విప్ అనేది రాజ్యాంగ హక్కు అన్న విషయాన్ని సీఎం పిటీషన్లో ప్రస్తావించారు.
సుప్రీంలో మరో పిటీషన్
శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించినట్లు సమాచారం.