కాంగ్రెస్ కి కర్ణాటక ఓ ఏటీఎం.. దానికి చీఫ్ మేనేజర్ కుమారస్వామి: బీజేపీ
బెంగళూరు: తాను కాంగ్రెస్ దయతోనే సీఎం అయ్యాను తప్ప కర్ణాటక ప్రజల వల్ల కాదని పేర్కొన్న సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కర్ణాటక ప్రజలను, దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే రీతిలో కుమారస్వామి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతోంది.
అంతేకాదు, కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ ఏటీఎంకి 'చీఫ్ మేనేజర్(సీఎం)' లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ గాంధీల కాళ్ల మీద కుమారస్వామి సాగిలపడుతున్నారని విమర్శించింది. 'దీనికంటే విచారం మరొకటి ఉండదు. ప్రజాస్వామ్య పంథాకు వక్రభాష్యం చెప్పడం దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే' అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్ర తెలిపారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయని, ప్రస్తుతం వాటి పతనం మొదలైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అనేది ఒక ఏటీఎం లాంటిదని, దానికిప్పుడు కుమారస్వామి అనే చీఫ్ మేనేజర్ ను నియమించుకుందని ఆయన ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో ప్రభుత్వం కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నివాసాల నుంచే నడుస్తుందని విమర్శించారు.ఇక బీజేపీని ఎదుర్కొనే నేతగా, ఆ స్థాయి సత్తా రాహుల్ గాంధీకి ఉందని చాలా పార్టీల నేతలు భావించడం లేదని మోడీ అన్నారు. ఒడిశాలోనూ తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.