దీదీతో కేంద్రం ఢీ: కోల్కత మెట్రో కారిడార్ ప్రారంభోత్సవ ఆహ్వానపత్రంలో మమతా బెనర్జీ పేరు గల్లంతు..!
కోల్కత: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే నాయకురాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏచిన్న అవకాశం దొరికినా.. బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడానికి ఏ మాత్రం వెనుకాడని ఫైర్ బ్రాండ్. అలాంటి మమతా బెనర్జీని మరోసారి ఢీ కొట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. దీనిపై మమతా దీదీ ఏ రేంజ్లో చెలరేగిపోతారనేది ఆసక్తికరంగా మారింది.
ఎల్ఐసీ బచావో: విమానాలు, రైళ్లు..ఇక బీమా సంస్థ.. అమ్ముకుంటూ పోవడమేనా? :మమతా ఫైర్
మమతా లేకుండానే.. మెట్రో కారిడార్..
కోల్కత మెట్రో రైల్వే, ఈశాన్య రైల్వే సంయుక్తంగా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ను నిర్మించాయి. మెట్రో కారిడార్ తొలిదశ కింద సాల్ట్ లేక్ సెక్టార్-5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు దీన్ని నిర్మించారు. మరి కొన్ని గంటల్లో ఈ కారిడార్ ప్రారంభం కానుంది. ఈ సాయంత్రం 5 గంటలకు రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయెల్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో సహా బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ముఖ్యమంత్రి అయినా మమతను ఆహ్వానం లేదు..
ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈశాన్య రైల్వే కార్యాలయం రూపొందించిన ఆహ్వానపత్రంలో మమతా బెనర్జీ పేరు గల్లంతయింది. పొరపాటు చోటు చేసుకుందో.. లేక ఉద్దేశపూరకంగా చేశారో తెలియట్లేదు గానీ.. మమతా బెనర్జీ పేరు లేకుండా ఈశాన్య రైల్వే ముద్రించిన ఆహ్వానపత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇప్పటిదాకా కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మమతా కేబినెట్ మంత్రులకు ఆహ్వానం..
ఇదే కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఈశాన్య రైల్వే అధికారులు మమతా బెనర్జీ కేబినెట్ మంత్రికి ఆహ్వానం పంపడం అసలు ట్విస్ట్. పశ్చిమ బెంగాల్ అటవీ, అత్యవసర సర్వీసుల శాఖ మంత్రి సుజిత్ బోస్, బారాసాత్ లోక్సభ సభ్యుడు కకోలి ఘోష్ దస్తీదార్ అలాగే.. బిధాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కృష్ణా చక్రబర్తిలను ఆహ్వానించారు. దీన్ని బట్టి చూస్తే.. ఉద్దేశపూరకంగానే మమతా బెనర్జీ పేరును విస్మరించారనే అనుమానాలు వ్యక్తమతున్నాయని తృణమూల్ కాంగ్రెెస్ నాయకులు మండిపడుతున్నారు.
గైర్హాజర్ కానున్న మంత్రి..
ఈ మెట్రో కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఉన్నప్పటికీ.. హాజరు కావట్లేదని సుజిత్ బోస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. తమ ముఖ్యమంత్రిని ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు. అలాంటి కార్యక్రమానికి తాను వెళ్లట్లేదని ఆయన చెబుతున్నట్లు సమాచారం. రైల్వే అధికారుల ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా- ఈ రెండు పార్టీల మధ్య మరోసారి ప్రచ్ఛన్న యుద్ధానికి ఈ ఘటన దారి తీస్తోందని అంటున్నారు.