అవినీతి ఆరోపణలు: విద్యాశాఖకు కొత్త మంత్రి?, బీహార్ సీఎంతో చౌదరి భేటీ, కీలక చర్చ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేవాలాల్ చౌదరిపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఆ మంత్రిని వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.
మేవాలాల్ చౌదరితో సీఎం నితీష్ కుమార్ బుధవారం సమావేశమయ్యారు. మంత్రి మేవాలాల్ చౌదరిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరలించుకుంది. తన మంత్రివర్గం నుంచి మేవాలాల్ చౌదరిని నితీష్ కుమార్ తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మేవాలాల్ చౌదరిపై అవినీతి ఆరోపణలు రావడంపై నితీష్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చౌదరితో భేటీ అయిన నితీష్.. విద్యా శాఖ బాధ్యతలను మరొకరికి అప్పగించే విషయంపై చర్చించినట్లు సమాచారం.
2017లో భగల్పూర్ సబౌర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా వ్యవహరించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, ఈ వ్యవహారంలో చౌదరిపై కేసు కూడా నమోదైంది. నిబంధనలకు వ్యతిరేకంగా 161 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ సైంటిస్టుల నియామకం చేపట్టారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
అంతేగాక, యూనివర్సిటీ భవన నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను కూడా చౌదరి ఎదుర్కొంటున్నారు. 2017లో బీహార్ గవర్నర్గా ఉన్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చౌదరిపైవిచారణకు ఆదేశించారు. అయితే, విచారణలో అవినీతి జరిగినట్లు తేలడం గమనార్హం. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను చౌదరి ఖండించారు.