సుప్రీం తీర్పు ఎఫెక్ట్: సీఎం యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది?
బెంగళూరు: సుప్రీంకోర్టు బలనిరూపణ ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు.
యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు.
అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేసినట్లు తెలుస్తోంది.
కాగా, శనివారం సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న విషయం తెలిసిందే. అధికారంలో కొనసాగేందుకు బీజేపీ తనకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్-జేడీఎస్లు కూడా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.