కొడనాడు ఎస్టేట్ మిస్టరీ: హత్యల వెనక సీఎం పళని స్వామి హస్తం..?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్తో సంబంధం ఉన్న పలువురు మృతి చెందిన విషయం సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సయాన్... తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యూల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ హత్యలన్నిటి వెనక తమిళనాడు సీఎం పళని స్వామి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
జయలలిత మృతి తర్వాత కొడనాడు ఎస్టేట్పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆ సమయంలోనే ఆ ఎస్టేట్ వాచ్మెన్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి నాడు పోలీసులు జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ను అరెస్టు అయ్యారు. అనంతరం ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఇక ఇదే కేసుకు సంబంధించి మరో నిందితుడిగా ఉన్న సయాన్ కేరళలో తన కుటుంబంతో కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్య విష్ణుప్రియ తన ఐదేళ్ల కూతురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయాన్ హాస్పిటల్లో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. ఎస్టేట్కు సంబంధించి సీసీ కెమెరాలను పరిశీలించే వ్యక్తి కూడా ఉరివేసుకుని మరణించడంతో కొడనాడులో ఏమి జరుగుతోందనే అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇదిలా ఉంటే కొడనాడు ఎస్టేట్లో జరుగుతున్న అనుమానాస్పద మరణాలకు సంబంధించి నాడు డీఎంకే సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. తమకు జయలలిత మృతిపై కూడా అనుమానాలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే సయాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడనాడు హత్యల వెనక సీఎం పళనిస్వామి హస్తం ఉందని చెప్పడంతో తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకే అంశంతో ముడిపడిఉన్న వ్యక్తులు హత్యకు కావడం లేదా వారిపై హత్యాప్రయత్నం జరగడం చూస్తుంటే ఏదో పెద్ద కుట్రే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలని జయలలిత అభిమానులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తున్నాయి. అసలు కొడనాడు ఎస్టేట్ ఎవరిది అనేది తేలితే మిగతా విషయాలు బయటకు వస్తాయని డీఎంకే చెబుతోంది.